మన రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో మహానంది ఒకటి. ఈ క్షేత్రమంతా ఎన్నో అద్భుతాలకి నెలవు. అలాంటి ఈ ప్రదేశంలో తాజాగా మరో అద్భుతం జరిగింది. ఇక్కడి కోనేరులో నీరు అంతకంతకీ పెరిగిపోతుంది. ఈ వింతని చూడటానికి జనం తండోపతండాలుగా ఇక్కడికి వస్తున్నారు. అంతేకాదు, ఇదంతా ఆ పరమేశ్వరుని మహిమే అంటూ పూజలు కూడా నిర్వహిస్తున్నారు.
మహానంది క్షేత్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న నంద్యాల పట్టణానికి 14 కి.మీ దూరంలో ఉంది. ఈ క్షేత్రంలో మహానందీశ్వరుడు, కామేశ్వరీ దేవి, కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం 7వ శతాబ్దం నాటిది. ఆలయ శిల్ప శైలిని బట్టి ఇది 680-696 మద్య కాలంలో పరిపాలన సాగించిన బాదామి చాళుక్య చక్రవర్తి అయిన వినయాదిత్యుని కాలానికి చెందినదని చరిత్ర చెప్తుంది.
అయితే, ఈ క్షేత్రంలో కొలువై ఉన్న శివలింగానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే, శివలింగంపై ఆవు కాలి గిట్టలు ఉంటాయి. దీనికి కారణం పుట్టలోపల ఉన్న పరమశివునికి ఒక గోవు పాలు ఇస్తుండగా… యజమాని కోపించి కొట్టబోతే… భయంతో పరిగెడుతూ… ఆ గోవు పొరపాటున ఆ లింగాన్ని తొక్కేస్తుంది. అందుకే శివలింగంపై ఆవు కాలి గిట్టల గుర్తులు ఉంటాయి. అంతేకాక, ఆవు తొక్కడంతో లింగం కొద్దిగా అణిగినట్లుగా కూడా ఉంటుంది.
ఇక్కడున్న మరో ప్రత్యేకత ఏంటంటే, ఆలయ అంతరాలయంలోని శివలింగం కిందనుండీ నిరంతరం నీటు ఊట వస్తుంటుంది. ఇలా వచ్చే నీరు ఆలయ పుష్కరిణిలోకి చేరుతుంది. ఈ నీరు ఆలయ గాలి గోపురం ముందువైపు ఉన్న రెండు గుండాల ద్వారా బయటికి ప్రవహిస్తుంది. ఈ పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడూ స్వచ్చంగా, పరిశుభ్రంగా ఉంటుంది. అంతేకాక, ఎన్నో ఔషధ గుణాలని కూడా కలిగి ఉంది. అందుకే, ఈ నీటిని భక్తులకి తీర్ధంగా ఇస్తారు.
అటువంటి ఈ రుద్రగుండం కోనేరులోని నీటి ఊట క్రమక్రమానికీ పెరగసాగింది. దీంతో నీటి ప్రవాహ వేగం ఒక్కసారిగా పెరిగింది. విషయం తెలుసుకున్న ఆలయ సిబ్బంది, మరియు అర్చకులు కోనేరులోని నీటి ఊటకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించిపోతున్నారు.