తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా రథసప్తమి నుంచి బహుళ పాడ్యమి వరకు ఆలయంలో విశేష కార్యక్రమాలు జరిగాయి. భీష్మ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం నిర్వహించారు.
శుక్రవారం అర్ధరాత్రి 12గంటల35 నిమిషాలకు శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ క్రతువును పూర్తిచేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించటానికి అశేష భక్త జన సందోహం తరలివచ్చారు.
వశిష్ఠ గోదావరీ తీరం వశిష్ఠ మహర్షి తపస్సు చేసిన పుణ్యస్థలి. అలానే, బ్రహ్మదేవుడు యజ్ఞ యాగాలు నిర్వహించిన ప్రదేశం. ఇక్కడి స్వామివారిని సాక్షాత్తూ ఆ శ్రీరామ చంద్రుడే దర్శించుకున్న దివ్యధామం. అందుకే, అంతర్వేది నిత్య పూజలు అందుకునే పవిత్ర ప్రదేశం. ఈ కారణంగానే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచీ వచ్చిన భక్తులతో అంతర్వేది కిక్కిరిసి పోయింది.